Monday, September 19, 2016

ఇంకెన్నాళ్లు....?






"నైతిక విలువల పేరిట చేతులు కట్టుకోకుండా... సైనిక మార్గంలో వెళ్తే పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ ఎప్పుడో భారత్‌ వశమయ్యేది...” ఈ మధ్య భారత ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్‌ మార్షల్‌ అరూప్‌ రాహ చేసిన వ్యాఖ్యలివి. ఉరీలో జరిగిన ఉగ్రవాద దాడిని, పాక్‌ మద్దతుతో ఉగ్రమూకలు చేస్తున్న అరాచకాలు చూస్తుంటే... మళ్లీ ఈ మాటలు గుర్తుకు చేసుకోవాల్సి వస్తోంది.
శాంతికి కూడా ఒక హద్దుంటుంది. మనం మనుషులం మహర్షులం కాదు. ఎప్పుడు ఏ ఉగ్రవాది వచ్చి ఎక్కడ బాంబు పేలుస్తాడో అని వణికిపోతున్నారు 100 కోట్ల మంది భారతీయులు. ఇది జీవించే హక్కుని హరించడమే. పదేపదే కవ్విస్తే పిల్లి కూడా ఎదురుతిరుగుతుందిమనుషులను చంపేస్తుంటే... శాంతి.. శాంతి... అనడం రాజనీతి కాదు. శాంతి... దేశాన్ని ఉన్నతం చేయాలి. శాంతిని స్థాపించాలంటే ఆశాంతిని తరిమేయాలిఆ పని చేయకపోవడం వల్లే... మన దేశానికి పాక్‌ టెర్రర్‌ చీడ వదలడం లేదు. ఇన్నాళ్లు వల్లించిన శాంతి మంత్రం వల్లే... ఉగ్రవాదులు ఏకంగా వ్యవస్థలను ఏర్పరుచుకుని ప్రపంచానికి వణుకు పుట్టిస్తున్నాయి. ఆ పాపంలో అమెరికాకు ఎంత భాగం ఉందో, పరోక్షంగా భారత్‌కి అంతే భాగం ఉంది. ఎంత మందిని చంపినా... భారత్‌ ఏమీ అనదు.. మహా అయితే అత్యవసర సమావేశం ఒకటి ఏర్పాటు చేస్తుంది... అంతకు మించి ఏం చేయదు అనే విషయం దశాబ్దాలుగా ఉగ్రవాదులకు బాగా తెలిసిపోయింది. పార్లమెంటు మీద దాడి చేసినా శాంతి మంత్రంలో మార్పు లేదు, ముంబయ్‌ మీద దాడి చేసినా... పెద్ద మార్పు లేదు. ఇప్పుడు ఏకంగా మన సైనిక స్థావరాల మీదకు వచ్చి పడ్డారు. అసలు ఎక్కడ నుంచి మొదలైంది ఈ సమస్య అంటే... స్వతంత్రం వచ్చిన నాటి కాలానికి వెళ్లాలి.ఈ అరాచకాలకు బీజం పడిన ఓ సంఘటనను, అప్పటి విదేశాంగ నిర్ణయాల్లో జరిగిపోయిన సరిదిద్దుకోలేని తప్పుని ఓ సారి గుర్తు చేసుకోక తప్పదు.
అది 1947. దేశ విభజన జరిగిన సమయం. అప్పటికే పాకిస్తాన్‌ తన గుంట నక్క బుద్ధి ప్రదర్శించింది. విద్వేష మూకలను రెచ్చగొట్టి కశ్మీర్‌లోకి పంపింది. చొరబాటుకి తెగించింది. ఇంత జరుగుతున్నా... అప్పటి
ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది. కనీసం వారిని తరిమికొట్టాలన్న స్పృహ కూడా లేకుండా పోయింది. దీనంతటికీ కారణం నెహ్రూ. కశ్మీర్‌లో కొంత భాగాన్ని పాక్‌ అక్రమించింది అప్పుడే. ఇప్పుడు POK అని పిలుస్తున్నాం. ఉగ్రవాదులు సేఫ్‌ ప్లేస్‌గా మారిన భూభాగం అదే. అప్పట్లో నెహ్రూ మెతకతనం... భవిష్యత్‌ భద్రత మీద అవగాహన లేని నిర్ణయాల వల్ల... దశాబ్దాలుగా పాక్‌ దురాగతాలకు ఫలితాన్ని తరతరాలుగా అనుభవించాల్సి వస్తోంది. అప్పట్లో ఆ విధానాన్ని ఉన్నత ఆదర్శంగా పిలిచారు. ఆదర్శం అనేది రెండు వైపులా ఉండాలి. ఒకవైపే ఉంటే అది చేతకానితనమే అవుతుంది. మన ఆదర్శాలు వంద కోట్ల ప్రజల మీద దుష్ప్రభావం చూపకూడదు. చూపితే అది ఆదర్శం అనిపించుకోదు. అప్పట్లో చేయాల్సిన పని... సైనిక చర్య. అది చేయకపోడం ముమ్మాటికీ తప్పే. అదే మాట పరోక్షంగా ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌ నోటి నుంచి వచ్చింది. అంతటి వ్యక్తి ఆ మాట అన్నారంటే... సైన్యం సరిహద్దుల్లో ఎంత కష్టపడాల్సి వస్తోందో అర్థం కావడం లేదా ?


1947లో కశ్మీర్‌ విషయంలో ఏం జరిగిందో అరూప్‌ రాహ స్పష్టంగా వివరించారు. నాడు పాక్‌ చొరబాటుదారులను తరిమికొట్టేందుకు అవసరమైన సైనికులను, సామగ్రిని తరలించేందుకు వైమానిక దళాన్ని రంగంలోకి దించారు. సైనిక చర్యకు అంతా సిద్ధమైంది, ఫలితం కూడా మనకు అనుకూలంగా
ఉంది. అయినా నెహ్రూ ప్రభుత్వం వెనకడుగేసింది. ఒకవైపు రక్తం చిందుతుంటే శాంతి మంత్రం జపించింది. ఆ సమయంలో అది సరైన నిర్ణయం కాదు. సమస్యను పరిష్కరించాలని ఐక్యరాజ్య సమితిని కోరింది. అమెరికా ప్రభుత్వం కనుసన్నల్లో నడిచే ఐక్యరాజ్యసమితి ఈ సమస్యను పరిష్కరిస్తుందని మేధావి నెహ్రూ ఎలా భావించారో అర్థం కాని విషయం. అప్పటికే అమెరికా రష్యా ప్రచ్ఛన్న యుద్ధంలో భాగంగా uno ఏమీ చేయలేకపోయింది. అలాంటి
సమయంలో భారత ప్రభుత్వం... UNO దగ్గరికి వెళ్లి తనను తానే తక్కువ చేసుకుంది. నిర్ణయం తీసుకునే సమర్థత మాకు లేదు అని ప్రపంచానికి చెప్పుకున్నట్టు అయింది. ఇది జరిగి 70 ఏళ్లైంది... ఇప్పటి వరకు ఈ విషయంలో ఐక్యరాజ్యసమితి అడుగు ముందుకేసింది లేదు. ఆ తప్పుడు నిర్ణయం కారణంగా భారత్‌ చాలా నష్టపోయింది... ఇప్పటికీ నష్టపోతూనే ఉంది. ఉగ్రమూకల ఆగడాలు విస్తరించేందు ఆ నిర్ణయమే పరోక్షంగా సహకరించింది.
స్వతంత్రం వచ్చిన రోజుల వ్యవధిలోనే మన నెత్తిన పాక్‌ కుంపటి రాజుకుంది. దేశ విభజన తర్వాత... రాజ్యాలన్నీ భారతలోనూ, కొన్ని పాకిస్తాన్‌లోనూ విలీనం అయ్యాయి. అప్పటి కశ్మీర్‌ రాజు హరిసింగ్‌... స్వతంత్రంగా ఉండాలనుకున్నాడు. సమస్య ఇక్కడి నుంచే మొదలైంది. ఇదే అదనుగా పాక్‌ మూకలు కశ్మీర్‌లో చొరబడ్డాయి. కశ్మీర్‌లో చాలా భాగాన్ని ఆ మూకలు ఆక్రమించాయి. వారిని తరిమేందుకు హరిసింగ్‌ సైనిక శక్తి సరిపోలేదు. అప్పటికే ఆ మూకలు ఉరీ వరకు (తాజా దాడి జరిగింది అక్కడే, నాడు దాడి జరిగిందీ సెప్టెంబరులోనే) వచ్చేశాయి. హరిసింగ్‌ బలహీన సైన్యం వల్ల పాక్‌ మూకలు శ్రీనగర్‌ వరకు వచ్చేశాయి. ఇక తన వల్ల కాదనుకున్న హరి సింగ్‌... పరిస్థితిని అదుపులోకి తేవాలని భారత దళాలకు విజ్ఞప్తి చేశాడు. కశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేశాడు. అలా 1947 అక్టోబర్‌ 26న భారత్‌లో కశ్మీర్‌ విలీనం అయింది. అక్టోబర్‌ 27న భారత వైమానిక దళాలు కశ్మీర్‌కు చేరుకున్నాయి. బారాముల్లా, ఉరీ ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నాయి. అప్పటి హోం మంత్రి పటేల్‌కు నిర్ణయాధికారం ఇచ్చి ఉంటే... ఇప్పుడసలు POK అనే పదం ఉండేది కాదు. సరిగ్గా అదే సమయంలో నెహ్రూ తీసుకున్న నిర్ణయంతో పరిస్థితి మారిపోయింది. పటేల్‌ ఎంత చెప్పినా వినకుండా చారిత్రక తప్పిదం చేసేశారు నెహ్రూ. UNOకు ఫిర్యాదు చేశారు. కోర్టుల్లో కేసులే సంవత్సరాల తరబడి సాగుతున్నాయి. దేశాల మధ్య వివాదాలు తెగాలంటే తెగేవా? UNO ఒక కమిషన్‌ వేసింది. చివరికి పాకిస్తాన్‌ తప్పు వప్పుకుంది. పోనీ ఏమైనా శాశ్వత పరిష్కారం లభించిందా అంటే ఏమీ లేదు. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఆ నిర్ణయం అమలైందా...? ఈ డెబ్బై ఏళ్లలో ఎన్ని సార్లు పాక్‌... కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందో... చిన్న పిల్లాడినైనా చెప్తాడు. మరి UNOకి వెళ్లి నెహ్రూగారు ఏం సాధించినట్టు? ఇక్కడ మరొకటి కూడా జరిగింది... ఆ సంఘటనతో కూడా నెహ్రూ ప్రభుత్వం కళ్లు తెరుచుకోలేదు. UNOకి ఫిర్యాదు చేయడానికి ముందు నెహ్రూ... అప్పటి పాక్‌ ప్రధాని లియాఖత్‌ అలీఖాన్‌ని కలిసి... పరిస్థితిని అదుపుచేయాలని కోరారు. తన వల్ల కాదని తేల్చి చెప్పారు లియాఖత్‌. దేశ ప్రధాని అదుపులోనే దేశం లేనపుడు... UNO మాత్రం ఏం చెయ్యగలదు. ఈ విషయం తెలిసీ UNO దగ్గరికి వెళ్లడం సరైన నిర్ణయం కాదని... ఇప్పటికీ విదేశీ వ్యవహారాల్లో తలపండిన మేధావులు చెప్తూనే ఉంటారు. ఆనాటి ఆ నిర్ణయమే నేటి కశ్మీర్‌ మారణహోమానికి ప్రధాన కారణం. మన చేతుల్లో ఉన్న పరిష్కారాన్ని తీసుకెళ్లి... దాన్నో అంతర్జాతీయ సమస్యగా మార్చి... ఎప్పటికీ తేలని వివాదంగా మార్చేసింది ఆ నిర్ణయం. ఆనాడు సైన్యానికి మరికొన్ని రోజులు అవకాశం ఇచ్చి ఉంటే... ఉగ్రవాదం ఈ స్థాయిలో ఉండే అవకాశమే లేదు. కానీ కాల్పుల విరమణను పాటించి... భారత్‌ ఆదర్శంగా నిలిచిన మాట ఆదర్శమే. ఆ ఆదర్శాన్ని పాక్‌ పాటించిన దాఖలాలు ఈ 70 ఏళ్లలో ఎప్పుడూ లేవు. ఆనాటి ఆ నిర్ణయమే... మన దేశానికి సంబంధించిన ప్రతీ భద్రతా విషయంలో... అమెరికా లాంటి అగ్రదేశాల జోక్యానికి ఆస్కారం ఇచ్చింది. మనకంటూ ప్రత్యేకంగా ఏ నిర్ణయం స్వేచ్ఛగా తీసుకోలేని పరిస్థితిని కల్పించారు ఆనాటి మేధావులు. పన్నుకి పన్ను.. కన్నుకి కన్ను అన్న మాటలు... ఇలాంటి దాడులు జరిగినప్పుడు మాత్రం ఆవేశంగా వినిపిస్తాయి. అమరులైన వీర జవాన్లకు నివాళుల హోరూ కొన్ని రోజులే. శాశ్వత పరిష్కారాలు మాత్రం ఎప్పటికీ కనిపించవు.ఉగ్రవాదం లేని ప్రశాంత భారతాన్ని చూడాలన్న సగటు భారతీయుడి ఎప్పటికీ కలేనా?





Friday, September 9, 2016

హీరో...






నిజంగా... పవన్‌ కళ్యాణే బెటర్‌. మీడియా ఆయన్ని ఎంత వెక్కిరిస్తే ఏం గాక, ఆయన్ని తిక్క అంటే అన్నారు గాక. ఈ మాత్రం మాటాడి ఆంధ్ర ప్రజల పక్షాన నిలిచి, వారి సెల్ఫ్‌ రెస్పెక్ట్‌కి గౌరవం ఇచ్చిన నేత ఎవరున్నారు చెప్పండి. అప్పుడు నాకు సరిగ్గా 9 ఏళ్లుంటాయి. ఓ పాతికేళ్ల క్రితం మాట. అప్పటికే మా మామయ్య ఆర్‌ఎస్‌ఎస్‌ ఫాలోవర్‌. మీటింగ్‌లు అవి మా మామయ్య ఇంట్లో జరుగుతుండేవి. నేను ఆయన దగ్గరే ఉండి చదువుకునే వాడిని. సహజంగానే వారి మీటింగ్‌లు అవీ నేను ఆసక్తిగా వినేవాడిని. అలా నాకు కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ అంటే అభిమానం. అప్పట్లో వెంకయ్య నాయుడు ఒక హీరో. ఎస్వీ రంగారావులాంటి విగ్రహం, జగ్గయ్యలాంటి వాచకం... భవిష్యత్తులో మన దేశం గర్వించే నాయకుడవుతాడ్రా.... అని మా మామయ్య అనేవారు. సహజంగా ఆయనంటే నాకు ఒక అభిమానం ఏర్పడింది. సీన్‌ కట్‌ చేస్తే.... గొప్ప నాయకుడైతే అయ్యారు. మా మామయ్య చెప్పిందైతే జరగలేదు. ఇక జరిగే అవకాశం కూడా లేదు. ఇప్పుడాయన్ని చూస్తుంటే జాలి కలుగుతోంది. అప్పటి వెంకయ్యకు, ఇప్పటి వెంకయ్యకు ఏ మాత్రం పొంతనే లేదు. ఆయన వేరు, ఈయన వేరు. ఎవరైనా కన్నతల్లికి అన్ని వసతులు కల్పించాలని అనుకుంటారు. కానీ, ఆయన పుట్టిన ఆంధ్రకు ఏమీ చెయ్యలేకపోయారు. కనీసం.. ఆయన రాజ్యసభలో ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకోలేక పూర్తిగా ఓడిపోయారు. ఆ మాట కూడా జనానికి చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు. ఇప్పుడాయనకు పదవి ముఖ్యం, హోదా ముఖ్యం, మోదీ ముఖ్యం... ఆంధ్ర ప్రదేశ్‌ మాత్రం ముఖ్యం కానే కాదు. పాపం ఏ మాటాడాలో తెలియక పంచెలో ఏముంది... పంచె కింద ఏముంది.. అనే లోక్లాస్‌ మాటలకు దిగిపోయారంటే.. ఏ మాటాడాలో తెలియకే...? ఆయనేసే జోకులకు ఆంధ్రులు నవ్వే పరిస్థితిల్లో లేరు. మరే చేద్దాం. జాలి పడదాం. ఎంతైనా సాటి ఆంధ్రుడు కదా. ఎలాగు మన ప్రభుత్వానికి, ప్రభుత్వం మాటకు కేంద్రంలో వీసమెత్తు విలువ లేదని అర్థమైపోయింది. మోదీ నిజమైన దేశ భక్తుడు. యస్‌... నిజం. అవసరమైతే మన రాష్ట్రానికి రావాల్సినవి ఆపైనా సరే... ఆయన మాతృభూమి గుజరాత్‌కే అన్ని వచ్చేలా.. చేసుకుంటారు. కనీసం ఆయన్నైనా ఆదర్శంగా తీసుకోవాలి కదా. పాపం... వాళ్లేం చెప్తే అది.. విని... పోన్లే ఈసారికి సర్దుకుపోదాం... అని... అరుణ్‌ జైట్లీకి పూలబొకేలు ఇచ్చి మరీ... మీరిచ్చిందే మహా భాగ్యం అని ఆయనకు క్యూలు కట్టి షేక్‌ హ్యాండ్‌లు ఇస్తున్న మన నాయకుడులను చూసి ఏం చేస్తాం జాలి పడడం మినహా. అందుకే వాళ్లందరి కన్నా పవన్‌ కళ్యాణ్‌ గొప్పవాడు. కనీసం నిలదీశాడు. జనం మాట మాట్లాడాడు. పదాల పడికట్టు తెలియకపోతేనేం, అక్కడక్కడ చిన్న తప్పులు వస్తేనేం, ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వకపోతేనేం.... సూటిగా సుత్తి లేకుండా చెప్పేశాడు. పడికట్టు పదాలతో జనాలను మభ్యపెట్టడానికి ఇంకా ఆయనకు వయసు సరిపోదు. (రాజకీయాల్లో). ఇంకా ఆయన రాజకీయ పరిణామ క్రమంలో ఇంకా తొలి దశలోనే ఉన్నాడు మరి.

Thursday, September 8, 2016

నేను... ఒక సగటు ఆంధ్రుడిని


                                                                అసలు అరుణ్‌ జైట్లీ ఏం చెప్పారు...? బట్టీ పట్టిన పాత పాఠమే మళ్లీ చెప్పారు. కొత్తగా ఏం చెప్పారని. అంతకు ముందోసారి చెప్పిన పేపరు, నిన్నటి పేపరు పక్కన పెడితే... దాదాపుగా కాపీ, పేస్ట్‌ అనిపించింది అంతే. చిన్న మార్పులు.. అవి కూడా చెప్పుకోదగ్గవి ఏం కాదు. కానీ, మీడియా ఏం చేసింది? ఓ...లక్షన్నర కోట్ల బడ్జెట్‌ పరుగులు తీసుకుంటూ వచ్చేస్తోంది. హోదా ఏం ఖర్మ... దాని బాబు వస్తోంది... చంద్రబాబు తెచ్చేస్తున్నారని షిఫ్ట్ల వారిగా దంచేశారు. పొద్దున్న నుంచి అర్థరాత్రి వరకు ఇండియా పాకిస్థాన్‌ ఒన్‌డే మ్యాచ్‌ చూసినంత ఉత్కంఠగా టీవీల ముందు కూర్చున్నారు ఆంధ్రులు. ఏదే జరిగిపోతోంది.. ఏదేదో వచ్చేస్తోంది... ఆంధ్ర వెలిగిపోయేలా కేంద్రం నిధులు ఇచ్చేస్తోంది అని తెగ అశలు పెట్టేసుకున్నారు జనం. తీరా చూస్తే కనీసం రైల్వే జోన్‌ ప్రకటన కూడా లేకుండా ఉప్పు లేని పప్పు, తాలింపు లేని చారులా మహా చప్పగా నడిచింది వ్యవహారం. దీని కోసం రోజంతా ఎదురు చూసిందంతా టైం వేస్ట్‌ తప్ప ఇంకోటి కాదు. అయితే ఈ టైం వేస్ట్‌కి కారణం... మీడియా హడావుడే.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను మభ్యపెడుతున్నది మీడియానే. ముఖ్యంగా చంద్రబాబు గారి ప్రాపకం కోసం పాకులాడుతున్న మీడియా ఆలోచన ధోరణి ఏ  దారిలో వెళ్తోందో అర్థం కాని పరిస్థితి. ఆంధ్ర ప్రదేశ్‌ అంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రమే కాదు... సుమారు 5 కోట్ల మంది జనాభా... వారి కలలు. విభజన పాత కథ.. పాచి కథ కూడా. ఇప్పుడున్న కర్తవ్యం... ఆంధ్ర ప్రదేశ్‌ మనుగడ మాత్రమే. ఇదొక్కటే కొత్త కథ. ఆ కథ కాస్త క్లారిటీగా ఉండాలి. కానీ ఏం చేశారు... ఈ కథ ఎప్పటికీ అమరావతి చేరని విషాద గాధగా మార్చేశారు. హోదా అంటారు, కాసేపటికి హోదా కన్నా ప్యాకేజీనే బెటర్‌ అంటారు, మళ్లీ హోదానే మా నినాదం అంటారు... ఇందులో ప్రభుత్వానికి దేనిపై క్లారిటీ ఉంది...? ఢిల్లీకి కాదు... ఆంధ్రప్రదేశ్‌ గల్లీలకే ముఖ్యమంత్రి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ గల్లీల్లో జనం మాటకే వత్తాసు పలకాలి. ఆ జనం మదిలో ఏముందో అదే ఢిల్లీలో నిలదీసి అడగాలి. అడిగేస్తున్నాం.. కడిగేస్తున్నాం... అని మాటలు తప్ప... కొత్త రాష్ట్రానికి (అవును మరి ఆంధ్రప్రదేశే కొత్త రాష్ట్రం) దిశ, దశ లేవు. కనిపిస్తున్నదల్లా అమరావతి అన్న మాట, గుప్పెడు మట్టి అంతే. ఈ నిజాన్ని కప్పిపెట్టి కొన్ని ఛానళ్లు చేస్తున్న హడావిడి ప్రజలను మోసం చేయడమే. ఎంతో మంది హైదరాబాద్‌ వచ్చారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఎర్పడ్డాక... సొంత గూటికి వెళ్లాలని ఎంతో మందికి ఆశ. కానీ... వెళ్లి అడిగి చూడండి... ఒక్కరి కళ్ళ్లల్లో కాన్ఫిడెన్స్‌ కనిపించదు. ఎందుకంటే.. ఆంద్రప్రదేశ్‌ ఎప్పటికి ఒక రూపు సంతరించుకుంటుందో తెలీదు. ఇదో బేతాళ ప్రశ్న. అసలు కేంద్రం మాటలకు కన్విన్స్‌ అవ్వాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకుందో అర్థం కాదు. అలాంటప్పుడు... హోదా రాదు.. అని జనాలను కన్విన్స్‌ చెయ్యాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిదే. ప్రయత్నించాం... రాలేదు... అని చెప్పేస్తే... మానసికంగా జనం దానికి నెమ్మదిగా అయినా సిద్ధపడతారు. ఆ మాట చెప్పరు, జనం హోదా మీద ఆశ చంపుకోరు. ఎలా మరి...? ఎక్కడ దీనికి ఫుల్‌స్టాప్‌ పడాలి. మరోవైపు... ప్యాకేజ్‌ అరచేతిలో స్వర్గాన్ని చూపిస్తున్న మీడియా కథనాలు.  రోజుకో కొత్త కథ చెప్తే...జనాలు ఎలా అర్థం చేసుకోవాలి?  తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధికి  నెమ్మదిగా దారులు వేసుకుంటూ పోతుంటే... ఆంధ్రలో ఏం జరుగుతోందో  తెలియని పరిస్థితి.. ఏమైనా అంటే గోదావరి పుష్కరాలు, కృష్ణ పుష్కరాలను చూపించి అదే అభివృద్ధి అనే దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నాం. అదేదో పుష్కరాలు జరగడం ఇదే మొదటిసారి అన్నట్టు. ఇక ఉత్తరాంధ్ర జిల్లాలు దిక్కమొక్కు లేని స్థితిలో ఉన్నాయి. రాయలసీమ అభివృద్ధి కనుచూపు మేరలో లేదు. కనీసం వారి కరవుకి మందేసే పరిస్థితి కనిపించడం లేదు. ఏమైనా అంటే అమరావతిని చూపిస్తున్నారు. అమరావతిలో ఆంధ్రప్రదేశ్‌ జనాభా అంతా పట్టదు కదా..? ప్రపంచ దేశాల్లో కూడా రాజధానికి పెద్దగా ఇంపార్టెన్స్‌ ఏం ఉందడు. అమెరికా అనగానే న్యూయార్క్‌ గుర్తొస్తుంది గానీ... వాషింగ్టన్‌ ఠక్కున గుర్తుకు రాదు. ఆస్ట్రేలియా అంటే సిడ్నీ అని ఎవరైనా చెప్తారు. కాన్‌బెర్రా ఆ  దేశ రాజధాని అని ప్రత్యేకంగా చెప్పాలి. నా ఉద్దేశం... రాజధాని అడ్మనిస్ట్రేషన్‌ సెంటరే తప్ప... రాష్ట్రానికి అదే గుండె కాయ కాదు. ఆర్థిక వనరులు తెచ్చే ప్రాంతాలు రాష్ట్రానికి గుండె కాయలు. ప్రపంచ వ్యాప్తంగా కూడా అలాంటి నగరాలే స్వర్గాలుగా మారాయి. ఆ ప్రభుత్వాల దృష్టి ఆ నగరాల మీదే ఇప్పిటికీ ఉంది. ఆర్థిక నగరాలను వదిలేసి.... ప్రభుత్వం మొత్తం దృష్టి అమరావతి మీద మాత్రమే పెట్టడం  వెనుక ఏ లాజిక్కు లేదు. కేవలం రాజకీయం మాత్రమే ఉంది. ఇవేవీ పాత్రికేయులకు, ఎలక్ట్రానిక్‌ మీడియా మిత్రులకు కనిపించక కాదు. వారిలో చాలా మందికి మనసులో ఉంది... వాస్తవాలు చెప్పాలని. కానీ, కంట్రోల్‌ వేరే చోట ఉంటుంది. వారేం చెయ్యలేరు. మొత్తానికి నా రాష్ట్రం కథ ఎటు పోతోంది... ఎక్కడకు చేరుతుంది... ఈ హోదాలు, ప్యాకేజీలు ఈ గోల కాదు... అసలేం చెయ్యబోతున్నారు... క్లారిటీ కావాలి. నా లాంటి ఎంతో మంది పౌరుల మదిలో నలిగిపోతున్న సమాధానం లేని ప్రశ్న ఇదే. ఇక్కడ ప్రభుత్వాన్ని నిందించడం కాదు నా ఉద్దేశం. ఇదే కొనసాగితే మరో దశాబ్దం తర్వాత కూడా హోదా, ప్యాకేజీ గోలే వినిపిస్తుంది... దేశంలోనే వెనుకబడిన ప్రాంతంగా ఆంధ్ర మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఎంతో మంది నిరుద్యోగులు కలలు, ఎంతో మంది విద్యార్థుల చదువు ఆశలు, ఏదో జరిగిపోతుంది... స్వర్ణాంధ్ర వచ్చేస్తోంది అని మీడియాలో ప్రతి క్షణం కనిపించే కథనాలు హోరు చూసి ఏవేవో  ఆశలు పెట్టుకున్న పౌరులను దయచేసి నిరాశ పరచొద్దని సగటు ఆంధ్రుడిగా విన్నవించుకుంటున్న విన్నపమిది....