Monday, September 19, 2016

ఇంకెన్నాళ్లు....?






"నైతిక విలువల పేరిట చేతులు కట్టుకోకుండా... సైనిక మార్గంలో వెళ్తే పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ ఎప్పుడో భారత్‌ వశమయ్యేది...” ఈ మధ్య భారత ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్‌ మార్షల్‌ అరూప్‌ రాహ చేసిన వ్యాఖ్యలివి. ఉరీలో జరిగిన ఉగ్రవాద దాడిని, పాక్‌ మద్దతుతో ఉగ్రమూకలు చేస్తున్న అరాచకాలు చూస్తుంటే... మళ్లీ ఈ మాటలు గుర్తుకు చేసుకోవాల్సి వస్తోంది.
శాంతికి కూడా ఒక హద్దుంటుంది. మనం మనుషులం మహర్షులం కాదు. ఎప్పుడు ఏ ఉగ్రవాది వచ్చి ఎక్కడ బాంబు పేలుస్తాడో అని వణికిపోతున్నారు 100 కోట్ల మంది భారతీయులు. ఇది జీవించే హక్కుని హరించడమే. పదేపదే కవ్విస్తే పిల్లి కూడా ఎదురుతిరుగుతుందిమనుషులను చంపేస్తుంటే... శాంతి.. శాంతి... అనడం రాజనీతి కాదు. శాంతి... దేశాన్ని ఉన్నతం చేయాలి. శాంతిని స్థాపించాలంటే ఆశాంతిని తరిమేయాలిఆ పని చేయకపోవడం వల్లే... మన దేశానికి పాక్‌ టెర్రర్‌ చీడ వదలడం లేదు. ఇన్నాళ్లు వల్లించిన శాంతి మంత్రం వల్లే... ఉగ్రవాదులు ఏకంగా వ్యవస్థలను ఏర్పరుచుకుని ప్రపంచానికి వణుకు పుట్టిస్తున్నాయి. ఆ పాపంలో అమెరికాకు ఎంత భాగం ఉందో, పరోక్షంగా భారత్‌కి అంతే భాగం ఉంది. ఎంత మందిని చంపినా... భారత్‌ ఏమీ అనదు.. మహా అయితే అత్యవసర సమావేశం ఒకటి ఏర్పాటు చేస్తుంది... అంతకు మించి ఏం చేయదు అనే విషయం దశాబ్దాలుగా ఉగ్రవాదులకు బాగా తెలిసిపోయింది. పార్లమెంటు మీద దాడి చేసినా శాంతి మంత్రంలో మార్పు లేదు, ముంబయ్‌ మీద దాడి చేసినా... పెద్ద మార్పు లేదు. ఇప్పుడు ఏకంగా మన సైనిక స్థావరాల మీదకు వచ్చి పడ్డారు. అసలు ఎక్కడ నుంచి మొదలైంది ఈ సమస్య అంటే... స్వతంత్రం వచ్చిన నాటి కాలానికి వెళ్లాలి.ఈ అరాచకాలకు బీజం పడిన ఓ సంఘటనను, అప్పటి విదేశాంగ నిర్ణయాల్లో జరిగిపోయిన సరిదిద్దుకోలేని తప్పుని ఓ సారి గుర్తు చేసుకోక తప్పదు.
అది 1947. దేశ విభజన జరిగిన సమయం. అప్పటికే పాకిస్తాన్‌ తన గుంట నక్క బుద్ధి ప్రదర్శించింది. విద్వేష మూకలను రెచ్చగొట్టి కశ్మీర్‌లోకి పంపింది. చొరబాటుకి తెగించింది. ఇంత జరుగుతున్నా... అప్పటి
ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది. కనీసం వారిని తరిమికొట్టాలన్న స్పృహ కూడా లేకుండా పోయింది. దీనంతటికీ కారణం నెహ్రూ. కశ్మీర్‌లో కొంత భాగాన్ని పాక్‌ అక్రమించింది అప్పుడే. ఇప్పుడు POK అని పిలుస్తున్నాం. ఉగ్రవాదులు సేఫ్‌ ప్లేస్‌గా మారిన భూభాగం అదే. అప్పట్లో నెహ్రూ మెతకతనం... భవిష్యత్‌ భద్రత మీద అవగాహన లేని నిర్ణయాల వల్ల... దశాబ్దాలుగా పాక్‌ దురాగతాలకు ఫలితాన్ని తరతరాలుగా అనుభవించాల్సి వస్తోంది. అప్పట్లో ఆ విధానాన్ని ఉన్నత ఆదర్శంగా పిలిచారు. ఆదర్శం అనేది రెండు వైపులా ఉండాలి. ఒకవైపే ఉంటే అది చేతకానితనమే అవుతుంది. మన ఆదర్శాలు వంద కోట్ల ప్రజల మీద దుష్ప్రభావం చూపకూడదు. చూపితే అది ఆదర్శం అనిపించుకోదు. అప్పట్లో చేయాల్సిన పని... సైనిక చర్య. అది చేయకపోడం ముమ్మాటికీ తప్పే. అదే మాట పరోక్షంగా ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌ నోటి నుంచి వచ్చింది. అంతటి వ్యక్తి ఆ మాట అన్నారంటే... సైన్యం సరిహద్దుల్లో ఎంత కష్టపడాల్సి వస్తోందో అర్థం కావడం లేదా ?


1947లో కశ్మీర్‌ విషయంలో ఏం జరిగిందో అరూప్‌ రాహ స్పష్టంగా వివరించారు. నాడు పాక్‌ చొరబాటుదారులను తరిమికొట్టేందుకు అవసరమైన సైనికులను, సామగ్రిని తరలించేందుకు వైమానిక దళాన్ని రంగంలోకి దించారు. సైనిక చర్యకు అంతా సిద్ధమైంది, ఫలితం కూడా మనకు అనుకూలంగా
ఉంది. అయినా నెహ్రూ ప్రభుత్వం వెనకడుగేసింది. ఒకవైపు రక్తం చిందుతుంటే శాంతి మంత్రం జపించింది. ఆ సమయంలో అది సరైన నిర్ణయం కాదు. సమస్యను పరిష్కరించాలని ఐక్యరాజ్య సమితిని కోరింది. అమెరికా ప్రభుత్వం కనుసన్నల్లో నడిచే ఐక్యరాజ్యసమితి ఈ సమస్యను పరిష్కరిస్తుందని మేధావి నెహ్రూ ఎలా భావించారో అర్థం కాని విషయం. అప్పటికే అమెరికా రష్యా ప్రచ్ఛన్న యుద్ధంలో భాగంగా uno ఏమీ చేయలేకపోయింది. అలాంటి
సమయంలో భారత ప్రభుత్వం... UNO దగ్గరికి వెళ్లి తనను తానే తక్కువ చేసుకుంది. నిర్ణయం తీసుకునే సమర్థత మాకు లేదు అని ప్రపంచానికి చెప్పుకున్నట్టు అయింది. ఇది జరిగి 70 ఏళ్లైంది... ఇప్పటి వరకు ఈ విషయంలో ఐక్యరాజ్యసమితి అడుగు ముందుకేసింది లేదు. ఆ తప్పుడు నిర్ణయం కారణంగా భారత్‌ చాలా నష్టపోయింది... ఇప్పటికీ నష్టపోతూనే ఉంది. ఉగ్రమూకల ఆగడాలు విస్తరించేందు ఆ నిర్ణయమే పరోక్షంగా సహకరించింది.
స్వతంత్రం వచ్చిన రోజుల వ్యవధిలోనే మన నెత్తిన పాక్‌ కుంపటి రాజుకుంది. దేశ విభజన తర్వాత... రాజ్యాలన్నీ భారతలోనూ, కొన్ని పాకిస్తాన్‌లోనూ విలీనం అయ్యాయి. అప్పటి కశ్మీర్‌ రాజు హరిసింగ్‌... స్వతంత్రంగా ఉండాలనుకున్నాడు. సమస్య ఇక్కడి నుంచే మొదలైంది. ఇదే అదనుగా పాక్‌ మూకలు కశ్మీర్‌లో చొరబడ్డాయి. కశ్మీర్‌లో చాలా భాగాన్ని ఆ మూకలు ఆక్రమించాయి. వారిని తరిమేందుకు హరిసింగ్‌ సైనిక శక్తి సరిపోలేదు. అప్పటికే ఆ మూకలు ఉరీ వరకు (తాజా దాడి జరిగింది అక్కడే, నాడు దాడి జరిగిందీ సెప్టెంబరులోనే) వచ్చేశాయి. హరిసింగ్‌ బలహీన సైన్యం వల్ల పాక్‌ మూకలు శ్రీనగర్‌ వరకు వచ్చేశాయి. ఇక తన వల్ల కాదనుకున్న హరి సింగ్‌... పరిస్థితిని అదుపులోకి తేవాలని భారత దళాలకు విజ్ఞప్తి చేశాడు. కశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేశాడు. అలా 1947 అక్టోబర్‌ 26న భారత్‌లో కశ్మీర్‌ విలీనం అయింది. అక్టోబర్‌ 27న భారత వైమానిక దళాలు కశ్మీర్‌కు చేరుకున్నాయి. బారాముల్లా, ఉరీ ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నాయి. అప్పటి హోం మంత్రి పటేల్‌కు నిర్ణయాధికారం ఇచ్చి ఉంటే... ఇప్పుడసలు POK అనే పదం ఉండేది కాదు. సరిగ్గా అదే సమయంలో నెహ్రూ తీసుకున్న నిర్ణయంతో పరిస్థితి మారిపోయింది. పటేల్‌ ఎంత చెప్పినా వినకుండా చారిత్రక తప్పిదం చేసేశారు నెహ్రూ. UNOకు ఫిర్యాదు చేశారు. కోర్టుల్లో కేసులే సంవత్సరాల తరబడి సాగుతున్నాయి. దేశాల మధ్య వివాదాలు తెగాలంటే తెగేవా? UNO ఒక కమిషన్‌ వేసింది. చివరికి పాకిస్తాన్‌ తప్పు వప్పుకుంది. పోనీ ఏమైనా శాశ్వత పరిష్కారం లభించిందా అంటే ఏమీ లేదు. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఆ నిర్ణయం అమలైందా...? ఈ డెబ్బై ఏళ్లలో ఎన్ని సార్లు పాక్‌... కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందో... చిన్న పిల్లాడినైనా చెప్తాడు. మరి UNOకి వెళ్లి నెహ్రూగారు ఏం సాధించినట్టు? ఇక్కడ మరొకటి కూడా జరిగింది... ఆ సంఘటనతో కూడా నెహ్రూ ప్రభుత్వం కళ్లు తెరుచుకోలేదు. UNOకి ఫిర్యాదు చేయడానికి ముందు నెహ్రూ... అప్పటి పాక్‌ ప్రధాని లియాఖత్‌ అలీఖాన్‌ని కలిసి... పరిస్థితిని అదుపుచేయాలని కోరారు. తన వల్ల కాదని తేల్చి చెప్పారు లియాఖత్‌. దేశ ప్రధాని అదుపులోనే దేశం లేనపుడు... UNO మాత్రం ఏం చెయ్యగలదు. ఈ విషయం తెలిసీ UNO దగ్గరికి వెళ్లడం సరైన నిర్ణయం కాదని... ఇప్పటికీ విదేశీ వ్యవహారాల్లో తలపండిన మేధావులు చెప్తూనే ఉంటారు. ఆనాటి ఆ నిర్ణయమే నేటి కశ్మీర్‌ మారణహోమానికి ప్రధాన కారణం. మన చేతుల్లో ఉన్న పరిష్కారాన్ని తీసుకెళ్లి... దాన్నో అంతర్జాతీయ సమస్యగా మార్చి... ఎప్పటికీ తేలని వివాదంగా మార్చేసింది ఆ నిర్ణయం. ఆనాడు సైన్యానికి మరికొన్ని రోజులు అవకాశం ఇచ్చి ఉంటే... ఉగ్రవాదం ఈ స్థాయిలో ఉండే అవకాశమే లేదు. కానీ కాల్పుల విరమణను పాటించి... భారత్‌ ఆదర్శంగా నిలిచిన మాట ఆదర్శమే. ఆ ఆదర్శాన్ని పాక్‌ పాటించిన దాఖలాలు ఈ 70 ఏళ్లలో ఎప్పుడూ లేవు. ఆనాటి ఆ నిర్ణయమే... మన దేశానికి సంబంధించిన ప్రతీ భద్రతా విషయంలో... అమెరికా లాంటి అగ్రదేశాల జోక్యానికి ఆస్కారం ఇచ్చింది. మనకంటూ ప్రత్యేకంగా ఏ నిర్ణయం స్వేచ్ఛగా తీసుకోలేని పరిస్థితిని కల్పించారు ఆనాటి మేధావులు. పన్నుకి పన్ను.. కన్నుకి కన్ను అన్న మాటలు... ఇలాంటి దాడులు జరిగినప్పుడు మాత్రం ఆవేశంగా వినిపిస్తాయి. అమరులైన వీర జవాన్లకు నివాళుల హోరూ కొన్ని రోజులే. శాశ్వత పరిష్కారాలు మాత్రం ఎప్పటికీ కనిపించవు.ఉగ్రవాదం లేని ప్రశాంత భారతాన్ని చూడాలన్న సగటు భారతీయుడి ఎప్పటికీ కలేనా?





No comments:

Post a Comment